ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులకు ఘన నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక కూటమి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భారతదేశాన్ని స్వాతంత్ర్యం ద్వారా లభించిన ఫలాలను ప్రస్తుత తరాలతో పాటు భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి భారతదేశం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధించి, యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా నిలవాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగి, దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




