కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని అందులో భాగంగానే గడిచిన రెండేళ్ల కాలంలో ఒక్క చివటం గ్రామాభివృద్ధికే రూ. 6.82 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమం ద్వారా రూ.1.20 కోట్ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించిన రోడ్లను శుక్రవారం మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగిస్తూ చివటం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సమగ్రంగా వివరించారు. చివటం గ్రామంలో పల్లె పండుగ 1.0 ద్వారా రూ.13 లక్షలతో 2 పనులు, పల్లె పండుగ 2.0 ద్వారా రూ.1.64 కోట్లతో 10 పనులు, రూ.33.28 లక్షల పంచాయతీ నిధులు, రూ.2.45 కోట్ల జల్ జీవన్ మిషన్ నిధులు, రూ.10 లక్షల మండల ప్రజా పరిషత్ నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.11.30 లక్షలతో 6 గోకులం షెడ్డులు, చివటం గ్రామం నుండి వడ్లూరు గ్రామం శివారు వరకు రూ.30 లక్షల ఆర్ అండ్ బీ నిధులతో బీటీ రోడ్డు, రూ.1.69 కోట్ల నాబార్డు నిధులతో గ్రామ పరిధి వరకు రోడ్డు వేయడం జరిగిందన్నారు. అదే విధంగా 8 మంది లబ్ధిదారులకు రూ.2.71 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, రూ.2.25 లక్షల విలువైన 2 ఎల్ వోసీ లెటర్లు అందించామన్నారు..
30 ఏళ్లకు సరిపడా మన్నికైన సీసీ రోడ్లు: మంత్రి దుర్గేష్
రాజకీయాల్లో ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడమే తమకు సంతృప్తినిస్తుందని మంత్రి దుర్గేష్ వ్యాఖ్యానించారు. చివటంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అధ్వాన్నపు రహదారుల సమస్యను గ్రామస్థులు తన దృష్టికి తేగానే ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 30 ఏళ్ల పాటు ఎటువంటి మరమ్మతులు అవసరం లేని విధంగా నాణ్యమైన సీసీ రోడ్లను నిర్మించామన్నారు. ఈ పనుల పూర్తికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాటి కలెక్టర్ పి. ప్రశాంతి మరియు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గత ప్రభుత్వం 2019-24 మధ్యకాలంలో ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని, కనీసం గుంతల్లో తట్టెడు మట్టి కూడా పోయలేని చేతకాని ప్రభుత్వంగా నిలిచిపోయిందని విమర్శించారు. నేడు కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో రోడ్ల నిర్మాణం చేపడుతోందని.. ఇందుకు సాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు.




