అక్టోబర్ 4 నుంచి 12 వరకు మానసిక ఆరోగ్యం అవగాహన వారోత్సవాలు జాతీయ వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్ తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఆదేశానుసారం 4 తేదీన శనివారం మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ తణుకు బ్రాంచ్ లో పిపిఎఐ జాతీయ సెక్రటరీ డా. పి.రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిపిఎఐ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డా. వింజరపు జనార్దనం, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా.యం. యస్. శ్రీనివాస్, కాకినాడ జిల్లా ప్రోగ్రాం అడ్వైసర్ డా. సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ జిల్లా అధ్యక్షులు లలితాదేవి, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కర్రీ రాజేష్ పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు.
డా. వింజరపు జనార్దనం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, ప్రతి ఏడుగురిలో ఒకరికి ఈ సమస్య ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిందని తెలిపారు. యువతలో ఆత్మహత్యలు ప్రధాన మరణ కారణమని పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా డా.హిప్నో కమలాకర్ మానసిక ఆరోగ్యంపై ఇరవై వేల ప్రోగ్రామ్స్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మానసిక ఆరోగ్యం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డా.యం. యస్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎవరో మనల్ని గుర్తించి గజమాల వేయాలని, పక్క వారితో పోల్చుకోవడంతో మానసిక అనారోగ్యం పాలవుతున్నారన్నారు. మనసు మంచిదన్నారు. కానీ మాయమాటలు, కఠినమైన ప్రవర్తనలతో మనసును కలతపరుస్తున్నామని తెలిపారు . గాయపడిన మనసుకు ఓదార్పు అవసరమని అందుకే మానసిక ఆరోగ్యం పై అవగాహన ముఖ్యమన్నారు.
ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అధ్యక్షులు లలితాదేవి మాట్లాడుతూ మహిళలు చిట్ చాట్.., మగవారు మనసు సున్నితం, విద్యార్థులు – ఆత్మహత్యలపై అవగాహన ,చదువు – ఒత్తిడి పై అవగాహన, ఆటలు – మానసిక ఆరోగ్యం , తల్లిదండ్రులు జన్మ భూమిపై – పిల్లలు విదేశాల్లో, ఒంటరి వృద్దులు – మానసిక ఆరోగ్యం, చెత్తతో మానసిక సమస్యలు, విద్యార్థులు – హాస్టల్స్ , ఇంటి పని – ఆఫీస్ పని బ్యాలెన్స్, సౌండ్ పొల్యూషన్ తో మానసిక సమస్యలు, మూఢనమ్మకాలు, గర్భిణీ స్త్రీలు మానసిక ఆరోగ్యం ప్రభావం వంటి 12 అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వివరించారు. డా. సరిపెల్ల శ్రీరామ చంద్రమూర్తి మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించడం, సమస్యలను గుర్తించడం, పరిష్కార మార్గాలను సూచించడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సినియర్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని తెలిపారు.


