నిడదవోలు: నిడదవోలులో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ప్రైవేట్ కాలేజీ బస్సు ప్రమాదంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ తీవ్రంగా స్పందించారు. ఎస్.ఎఫ్.ఎస్ జూనియర్ కాలేజీకి చెందిన బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడం వల్ల విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనపై ఆయన అధికారులతో మాట్లాడారు. బస్సులో ఉన్న విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని మంత్రి దుర్గేష్ ధృవీకరించుకున్నారు. స్వల్ప గాయాలైన క్లీనర్కు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రమాదం కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యాసంస్థల బస్సుల కండిషన్పై మంత్రి దుర్గేష్ సీరియస్ అయ్యారు. ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులకు తక్షణమే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తి లేదని, విద్యాసంస్థలు తమ వాహనాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


