జిల్లా అభివృద్ధిలో మాణిక్యాలరావు చెరగని ముద్ర

సామాన్యుడి నుంచి మంత్రిగా ఎదిగిన పైడికొండల

విగ్రహం ఆవిష్కరణలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

మాజీ మంత్రి, దివంగత పైడికొండల మాణిక్యాలరావు జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి మాణిక్యాలరావు విగ్రహం ఆవిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సామాన్యుడు రాజకీయాల్లో రాణించిన విధానం భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయమన్నారు. ప్రజల్లో చిరస్థాయిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. జిల్లాకు నిట్‌ తీసుకురావడానికి మాణిక్యాలరావు చేసిన కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా జాతీయ స్థాయి కళాశాలను తీసుకువచ్చిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు. ప్రజాసేవకుడిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎంతో సేవ చేసి అభివృద్ధికి కృషి చేశారన్నారు. బీజేపీలో అంకిత భావంతో పని చేసి ఏవిధంగా నాయకుడిగా ఎదగాలనే దానికి మాణిక్యాలరావు నిదర్శనమన్నారు. బీజేపీ నుంచి ఎమ్మల్యేగా ఎన్నికై వెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. క్రమంగా రాజకీయాల్లో ఎదుగుతున్న దశలో మనమధ్య దూరం కావడం విచారకరమన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా మాణిక్యాలరావు విగ్రహాన్ని కుమార్తె సింధు ముందుకు వచ్చి ఆవిష్కరించడం అభినందనీయమన్నారు.

Scroll to Top
Share via
Copy link