డి.ముప్పవరంలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ

పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల పరిశీలన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంపై ఆరా..కూటమి ప్రభుత్వ విద్యా సంస్కరణలను వివరించిన మంత్రి దుర్గేష్

నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ మంగళవారం డి.ముప్పవరంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాల సందర్శనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో సరదాగా గడిపారు. స్వయంగా పాఠ్యపుస్తకాన్ని చేతబూని విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. “కందుల దుర్గేష్ అంటే ఎవరు? ఈ నియోజకవర్గానికి ఆయన ఏమవుతారు?” అని చమత్కరిస్తూ విద్యార్థుల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని నింపారు. తాను కూడా సామాన్యంగా చదువుకుని పైకి వచ్చిన వాడినేనని, ఎవరూ కంగారు పడకుండా బాగా చదువుకోవాలని హితబోధ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై మంత్రి దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. వంట గదిని తనిఖీ చేసి, వంట ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా? రాగి జావ రుచిగా ఉందా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన మెనూలో ఏవైనా పదార్థాలు తక్కువైతే ధైర్యంగా అడిగి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం విద్యాశాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వివరించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక సంస్కరణలను ప్రస్తావించారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సాయంపై విద్యార్థుల తల్లిదండ్రులతో ఆరా తీశారు. విద్యార్థి మిత్ర కిట్ ను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణపై వివరాలు ఆరా తీసిన మంత్రి దుర్గేష్ తక్షణమే సొంత భవనంలోకి మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐసీడీఎస్ పీడీని ఫోన్ ద్వారా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల నూతన భవన నిర్మాణాలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల బోధనా తీరుపై విద్యార్థుల నుంచి సానుకూల స్పందన రావడంతో వారిని మంత్రి దుర్గేష్ వారిని అభినందించారు.

డి.ముప్పవరం ప్రజలతో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా మాట్లాడారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. డి. ముప్పవరం గ్రామ అభివృద్ధికి దాదాపు రూ.కోటి రూపాయలు ఖర్చు చేశామన్నారు. గ్రామానికి అంతర్గత రోడ్లు, వాటర్ ట్యాంక్ కావాలని ప్రజలు అడిగారు. వీధి దీపాల సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వంతో చర్చించి స్థానికంగా పదో తరగతి వరకు ఉండేలా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాలగా మార్పు చేశామన్నారు. విద్యార్థుల బాగోగులే తమకు ముఖ్యమన్నారు. ఉగాది నాటికి రోడ్డు పనులు ప్రారంభమవుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యాశాఖ అధికారులు మరియు అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link