సామూహికంగా ఎలుకల నివారణ చేపట్టండి, పంట నష్టాన్ని నివారించండి, అధిక దిగుబడులు సాధించండి అని చిలకపాడు గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఏఓ బి రాజారావు పిలుపునిచ్చారు. ధాన్యాల ఉత్పత్తి, నిల్వలలో రైతుకు ప్రథమ శత్రువులు ఎలుకలు, విత్తనం వేసినది మొదలు ధాన్యం అమ్మేవరకు లేదా తినేవరకు ఎలుకలు వరి పైరుకు, ధాన్యానికి నష్టం కల్గిస్తాయి. ఇవి తినేదానికన్నా 7-8 రెట్ల ధాన్యాన్ని అధికంగా పాడుచేస్తాయి. అందుచేతనే. రైతులు ఎలుకలను సమర్ధవంతముగా నివారించే ముందు వాటి బలాబలాలను అహారపు అలవాట్లు మరియు ఇతర విషయాలను గూర్చి తప్పక తెలుసుకోవాలి.
ఎలుకలను గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:
- ఎలుకల జీవిత కాలము 12 నుండి 18 నెలలు.
- ఎలుకలు 3 నెలల వయస్సు నుండి పిల్లలు కనటం ప్రారంభిస్తాయి.
- ఒక ఎలుక సంవత్సరంలో 10 కిలోల ఆహారధాన్యాన్ని తింటుంది. ఇది కాక 100 కిలోల ధాన్యాన్ని కలుషితం చేసి పాడుచేస్తుంది.
- మన దేశంలో ఎలుకల జనాభా మనుష్యుల కన్నా 5 రెట్లు ఎక్కువ.
5.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 నుండి 45 శాతం వరకు నష్టం ఉన్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి.
ఎలుక జాతులు:
పందికొక్కు చిన్న పందికొక్కులు, ఇళ్ళలో తిరిగే ఎలుక జాతులు జిల్లాలో పంటలకు నష్టం కలుగజేస్తున్నాయి.
వరిపొలాల్లో కలుగజేయు నష్ట వివరములు :
ఎలుకలు ఉల్లి వంటి ముందు పండ్లతో వస్తువులను సులభంగా కొరుకుతాయి. ఈ పండ్లు రోజుకు 0.4 మి.మీ. వంతున పెరుగుతాయి. ఇలా నిత్యం పెరుగుతూపోతే ఆ దంతాలు కపాలాన్ని చీల్చుకుపోవడం జరిగి ఎలుక మరణిస్తుంది. కనుకనే దంతాల పెరుగుదల అరికట్టటానికి, ఎలుకలు వాటికి ఎదురైన ప్రతి వస్తువును కొరుకుతాయి.2
నాటిన పొలంలో వరి దుబ్బులను ఏటవాలుగా 45 డిగ్రీల కోణంలో, నీటి మట్టం పైభాగంలో కత్తిరించి నష్టం కలిగిస్తాయి. కాండాన్ని, మొవ్వులను తింటాయి. కుదురు ఏర్పడిన నాటి నుండి కోత వరకు ఎలుకలు నిబ్బంభిస్తాయి. కంకులను కత్తిరించి ఈడ్చుకొనిపోయి జొరియలలో దాచి ధాన్యాగారాలు ఏర్పరచుకుంటాయి. పాలు పోసుకుంటున్న కంకులు, కొంచెం గట్టిపడుతున్న కంకులు ఎలుకలకు చాలా ఇష్టం. పంట కోసిన తరువాత పనల మీద, కళ్ళంలో, గిడ్డంగులలో కూడా నష్టం కొనసాగుతుంది. ఎలుకలు రాత్రిపూట సంచరిస్తాయి. పగలు బొరియలలో వుంటాయి. పొలాల్లో పైరు లేనప్పుడు ఎలుకలు ఆహారము కొరకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తాయి.
ఎలుకల నివారణ
ఎలుకలను సమర్ధవంతముగా నివారించుటకు సమగ్ర సస్యరక్షణ
పద్ధతులను పాటించాలి.
- సాగు పద్ధతులు:
- వేసవిలో లేదా దమ్ము సమయంలో గట్లను చెక్కి, వాటి పరిమాణాన్ని తగ్గించాలి.
- గట్లపై కలుపుమొక్కలను తీసివేయాలి.
- వీలున్నంతవరకు ఒక ప్రాంతంలో నాట్లు ఒకేసారి వేసుకోవాలి.
- పైరులో ప్రతి 8 అడుగులకు 12 అంగుళాల బాటలు తీయాలి.
II. యాంత్రిక పద్ధతులు:
- పొలాల్లో ఎలుక బోనులు, బుట్టలు ఉపయోగించి పైరు తొలిదశలోనే
ఎలుకలను నియంత్రించాలి.
- ఎలుక బొరియలలో ఊదర యంత్రాన్ని ఉపయోగించి పొగ పెట్టి చంపాలిIII. జీవ పద్ధతులు:
ఎలుకలకు సహజ శత్రువులైన గుడ్లగూబలను సంరక్షించాలి. పంగల కర్రలు వరి పొలములందు ఉంచుట వల్ల రాత్రి సమయాల్లో గుడ్లగూబలు వాటిపై వాలి పొలం పరిసరాల్లో సంచరించు ఎలుకలను వేటాడతాయి.
IV. రసాయన పద్ధతులు:
ఎలుకల నిర్మూలనకు వాడు రసాయనాలలో ప్రధానముగా రక్తమును గడ్డ కట్టించు, అన్నవాహిక ద్వారా ఉపయోగించు, ఏకమోతాదుగ వాడగలుగునది బ్రోమోడయోలోన్ రసాయన మందు. ఈ రసాయనమును వరినూకల ఎరలో 0.005 శాతం మోతాదులో వాడవలసి ఉంది. ఎలుకలు సాధారణముగా 5-6 రోజులలో చనిపోతాయి. ఈ మందు వాడినపుడు ఎలుకలకు దాహం వేసి, నీటికొరకు బయటకు వెళ్ళి చనిపోవడం వల్ల మరణించిన ఎలుకలు చాలామటుకు మనకు కనిపించవు. ప్రస్తుతము జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా బ్రోమోడయోలోన్ మందును ఉచితంగా సరఫరా చేయుచున్నారు. హెక్టారుకు 10 గ్రాముల బ్రోమోడయోలోన్ మందును వాడాలి. 100 గ్రాముల విషపు | ఎర తయారీకి 2 గ్రాముల బ్రోమోడయోలోన్ మందును 96 గ్రాముల నూకలు, 2 గ్రాముల నూనె కలిపి సజీవ బొరియకు 10 గ్రాముల చొప్పున పొట్లాలు (బూంది పొట్లాలలాగా) పెట్టాలి.
ఎలుకలను సమర్థవంతంగా అరికట్టుటకు జిల్లాలో ఈ కార్యక్రమమును ప్రతీ రైతు సేవా కేంద్రం పరిధిలో చేపట్టుట జరుగుచున్నది. కావున రైతులందరము ఈ కార్యక్రమమును సామూహికంగా గ్రామాల్లో చేపట్టి ఎలుకలు చేసే నష్టమును అరికట్టుకొందాము అని పూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది స్వప్న మీనాక్షి మరియు రైతులు పాల్గొన్నారు.


