తణుకు, అక్టోబర్ 15
సుధీర్ఘకాలంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు బుధవారం తణుకులో మున్సిపల్ కార్మికులు డిమాండ్స్ తో కూడిన వినతిపత్రాన్ని మహాత్మా గాంధీ విగ్రహానికి సమర్పించారు. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ గౌరవాధ్యక్షుడు బొద్దాని నాగరాజు మాట్లాడుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపులో భాగంగా నవంబరు 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాపితంగా నిరవధిక సమ్మెకు సమాయత్తమవుతున్నట్టు చెప్పారు.ఈ మేరకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తణుకు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 13 న తణుకు మున్సిపల్ కమీషనర్ టి. రామ్ కుమార్ కు సమ్మె నోటీసు సమర్పించామన్నారు.కనీసవేతనం 26 వేల రూపాయలు అమలు జరపాలని,12వ పీఆర్సీ ప్రకటించి 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, మరణించిన, రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులను అవుట్ సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకోవాలని,మున్సిపల్ కార్పోరేషన్ నగర పంచాయతీల్లో పెరుగుతున్న విస్తీర్ణంకు అనుగుణంగా కార్మికుల నిష్పత్తి పెంచాలని,డైలీ వేజ్ కార్మికులను అవుట్ సోర్సింగ్ లోకి తీసుకోవాలని, పర్మినెంట్ కార్మికుల పెడింగ్ బకాయిలు విడుదల చేయాలని,మున్సిపల్ కార్మికుల బ్యాంకు ఖాతాలు బలవంతంగా యాక్సిస్ బ్యాంకుకు మార్చరాదని, కార్మికుల పదవీవిరమణ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, కార్మికులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని తదితర డిమాండ్స్ పరిష్కారం కోరుతూ నవంబరు 3 నుంచి సమ్మె నిర్వహించనున్నామన్నారు.
మున్సిపల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మందుల ముత్తయ్య, గండ్రాపు శ్రీనివాసరావు, కొంబత్తుల రవికుమార్,మందుల ఏడుకొండలు, పాలపర్తి సత్యనారాయణ, పసల అప్పన్న, బిక్కవోలు వెంకటేష్, కొన్నే రమేష్, బంగారు నూకరాజు, గెడ్డం వెంకటేశ్వరరావు, కారంపూడి ఆంజనేయులు, బోడపాటి నారాయణ, మార్లపూడి బర్న, కె.సుజాత, గూడెల్లి వసంత, గెద్దాడ అన్నపూర్ణ, సిర్రా వాణి, ముక్కెర రాములమ్మ, అర్జీ పార్వతి, బంగారు లక్ష్మి, మందుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


