పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళస్థలాలు ఇస్తామన్న రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల నెరవేర్చాలని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ, ఏపీ మహిళా సమాఖ్య తాడేపల్లిగూడెం పట్టణ శాఖల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం 31వ వార్డులో ఇళ్ళస్థలాలు అర్జీలు పూరించారు. ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ పేదలు స్వంతగృహాలు లేక అద్దె ఇళ్ళకు నెలకు ఐదు, ఆరు వేల రూపాయలు అద్దెలు చెల్లించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామన్న అన్ని సంక్షేమపథకాలు కన్నా ఇళ్ళస్థలాలు ఇస్తామన్న హామీ ముఖ్యమైందన్నారు. పేదలు అద్దెఇళ్ళల్లో కాకుండా స్వంత ఇళ్ళలో వుండే పరిస్థితి కల్పిస్తే ప్రతీ పేద కుటుంబానికి నెలకు ఐదు నుంచి ఆరువేల రూపాయలు వరకు ఆర్థికభారం తగ్గుతుందన్నారు. తక్షణమే పేదలకు ఇళ్ళస్థలాలు ఇచ్చి ఆదుకోవాలని భీమారావు కోరారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. సీతారాంప్రసాద్, పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరావు, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్డాది మేరీ, ప్రధాన కార్యదర్శి ఎన్. నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


