రాజమహేంద్రవరంలో ఘనంగా ఇఫ్తార్ విందు..పాల్గొన్న మంత్రి దుర్గేష్
సామరస్యానికి, సోదరభావానికి ప్రతీక రంజాన్ మాసం అని వెల్లడి
రాజమహేంద్రవరం: మత సామరస్యానికి, సోదరభావానికి రంజాన్ పవిత్ర మాసం ప్రతీక అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం మోరంపూడిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ మాసం సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందని కొనియాడారు. “హిందూ ముస్లిం భాయ్ భాయ్” అనే నినాదంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని, అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈమాన్, నమాజ్, రోజా, హజ్ యాత్ర వంటి ఇస్లాం ధర్మాలను పాటిస్తూ, అల్లాహ్ స్మరణలో గడపడం శుభపరిణామమని మంత్రి దుర్గేష్ అన్నారు. సర్వ మానవాళి శాంతి మార్గంలో నడవాలని పవిత్ర ఖురాన్ బోధిస్తోందని, ఈ మాసంలో ముస్లింలు పాటించే కఠిన ఉపవాస దీక్షలు వారి పట్టుదలకు, దైవచింతనకు నిదర్శనమని అన్నారు.ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, కూటమి నాయకులు, ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.




