తణుకు పట్టణంలోని 20వ వార్డు సంగుల వారి వీధిలో శనివారం టైలర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభంలో కుట్టు మిషన్ రూపకర్త ఇలియాస్ హోవ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం సంఘనాయకులు టైలర్స్ వృత్తి ప్రాధాన్యతను వివరించారు. సంఘం అధ్యక్షుడు కత్తుల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు రెడ్డి సూర్యనారాయణ, కోశాధికారి గుత్తుకొండ సుబ్బారావు, కార్యదర్శి నూకెళ్ళ వెంకటరత్నం, ముంగండ శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో దర్జీ వృత్తిదారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి టైలరింగ్ ప్రధాన ఆధారమని, మహిళల ఆర్థిక స్వావలంబనకు కూడా ఈ వృత్తి దోహదపడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా టైలర్స్ వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. కుట్టు యంత్రాల కొనుగోలుకు సబ్సిడీలు, వడ్డీ రహిత రుణాలు, ఆధునిక శిక్షణ కేంద్రాల ఏర్పాటు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడం, ఆరోగ్య బీమా, పెన్షన్ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. ఇతర కార్మికవర్గాలకు అమలులో ఉన్న రాయితీలు దర్జీ సోదరులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రభుత్వం తరఫున వచ్చే గార్మెంట్స్ కాంట్రాక్టులను తణుకుకు చెందిన శ్రీ గంగయ్య టైలర్స్ ప్రాథమిక సహకార సంఘం లిమిటెడ్కు కేటాయించేలా సహకరించాలని రాష్ట్ర పిఏసి కమిటీ సభ్యులు, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణని సంఘ నాయకులు కోరారు. దర్జీ వృత్తి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తే ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ దర్జీసోదరులు రాసాబత్తుల పుల్లారావు, పోతాబత్తుల ఈశ్వరరావు, అనంతలక్ష్మి, పొడుగు భారతి, ఏలూరి త్రిమూర్తులు, తాతగుంట్ల పాండురంగరావు, ముస్తాక్ ఖాన్, తాడేపల్లి దుర్గారావు, వింజ్జుమూరి నాగభద్రం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఐక్యతా సందేశంతో, దర్జీ సోదరుల హక్కుల సాధన కోసం ఏకమై పనిచేయాలనే సంకల్పంతో ముగిసింది.


