ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు
రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి
సేవాపథంలో బుద్ధ విహార్ కొనసాగడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి దుర్గేష్
నిడదవోలు, జనవరి 25: ఆంధ్రప్రదేశ్లోని చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రాలను అనుసంధానం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’లుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలో నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు ముఖ్య అతిథులుగా హాజరై బుద్ధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తణుకు నుండి ఉండ్రాజవరం వరకు బౌద్ధ భిక్షువులతో కలిసి శాంతి ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా బౌద్ధ భిక్షువు బంతే ఆనాలయో నేతృత్వంలో బౌద్ధ ధర్మపీఠం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన ఈ విహార్ ద్వారా చిన్నారులకు విద్య, వైద్యం, యోగా, ధ్యానం, వక్తృత్వం, కరాటే, చిత్రలేఖనంలో ఉచిత శిక్షణ అందించడం గొప్ప విషయమని కొనియాడారు. కేవలం మతపరమైన కేంద్రంగానే కాకుండా, రాజ్యాంగ పరిరక్షణకు, శాంతి మార్గానికి ఈ విహార్ వేదిక కావడం సంతోషకరమన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, నాగార్జునకొండ, బొజ్జన్నకొండ, తోట్లకొండ వంటి చారిత్రాత్మక బౌద్ధ ప్రాంతాలను కలిపి బుద్ధిస్ట్ సర్క్యూట్ గా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. గతంలో వియత్నాంలో జరిగిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికల ప్రదర్శన బాధ్యతను పీఎంవో తనకు అప్పగించడాన్ని తనజీవితంలో దక్కిన అరుదైన గౌరవంగా గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో శాతవాహనుల కాలం నాటి బౌద్ధ ఆరామాలు, స్తూపాలు మరియు విగ్రహాలను సంరక్షిస్తూ, భావితరాలకు బౌద్ధ వారసత్వాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బౌద్ధ భిక్షువులు, ఉపాసకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


