తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో భజన మందిరాల నిర్మాణం.
పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో ఆలయాల అభివృద్ధికి పాలనాపరమైన అనుమతులు జారీ
గోదావరి పుష్కరాలు నాటికి పుణ్యక్షేత్రాల సర్వాంగ సుందరీకరణ లక్ష్యం: మంత్రి దుర్గేష్
హర్షం వ్యక్తం చేస్తున్న నిడదవోలు భక్త జన సందోహం
ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నిడదవోలు నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని పలు దేవాలయాల అభివృద్ధికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. భగవంతుని సేవలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఎస్సీ/ఎస్టీ/బీసీ కాలనీలో భజన మందిరాల నిర్మాణానికి అనుమతులు లభించాయి. అందులో భాగంగా పెరవలి మండలం నడుపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీ దుర్గా మాత దేవాలయానికి 5 సెంట్ల స్థలం, రూ. 10 లక్షలు, పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీ వినాయక స్వామి ఆలయానికి 10 సెంట్ల స్థలం, రూ. 20 లక్షలు, ఉండ్రాజవరం మండలంలోని పాలంగి గ్రామంలో బీసీ కాలనీలోని శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవాలయానికి 11 సెంట్ల స్థలం, రూ. 20 లక్షల నిధులు కేటాయిస్తూ దేవాదాయశాఖ పరిపాలన అనుమతులు జారీ చేయబడ్డాయని మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి పుణ్యక్షేత్రాలన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ పుణ్య కార్యానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నిర్ణీత కాల వ్యవధిలోగా, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం అత్యున్నత నాణ్యతతో ఈ నిర్మాణాలను పూర్తి చేసి భక్తులకు అంకితం చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. భగవంతుని సేవలో భాగంగా సామాన్య భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచడమే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో నిడదవోలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..



