జాతీయోద్యమంలో “ లౌకికవాదం “ అన్న పదాన్ని ప్రవేశ పెట్టింది గాంధీజీయేనని ప్రజా రిపబ్లిక్ ఉద్యమం కన్వీనర్ డి. వి. వి. యస్. వర్మ స్పష్టం చేశారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా స్థానిక బ్యాంక్ కాలనీలోని స్వాతంత్ర్య సమరయోధుల పార్క్ లోని గాంధీజీ విగ్రహం దగ్గర జరిగిన నివాళి సభలో ఆయన పై వ్యాఖ్యను చేశారు. డి. వి. వి. యస్. వర్మ మాట్లాడుతూ 1928 లో జాతీయ రాజ్యాంగ సూత్రాలపై మోతీలాల్ నెహ్రూ రిపోర్టులోనూ ,1931 కరాచీ సభ ఆమోదించిన తీర్మానంలోనూ లౌకిక భావాలు ప్రబలంగా వున్నప్పటికీ “ లౌకికవాదం” అన్న మాటను వినియోగించ లేదని 1933 లో గాంధీజీ తన రచనలలో, ప్రసంగాలలో పలుమార్లు ఉపయోగించారని ఆయన తెలియజేశారు.1933 లో ప్రభుత్వం “ అంటరానితనం పై తలపెట్టిన బిల్లును గాంధీజీ సమర్ధిస్తూ మానవజాతి నైతికతకు విరుద్ధమైన దీనిని “ లౌకిక రాజ్యం” అనుమతించకూడదని ప్రకటించారు.
అంతేకాదు 1946 లో ఒక క్రిస్టియన్ మిషనరీతో మాట్లాడుతూ
“ నేను గనుక రాజ్యాధినేత నైతే మతాన్ని- రాజ్యాన్ని వేరుచేస్తానని “ ప్రకటించారని. వ్యక్తిగతంగా సనాతన హిందువునని ప్రకటించుకున్నగాంధీజీ రాజ్యవ్యవస్థలో లౌకికవాదానికి ప్రతీకగా నిలిచారని ఆయన స్ఫూర్తితో దేశ సమైక్యత కోసం లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తిచేశారు.
సమరయోధుల కుటుంసభ్యులైన విశ్రాంత ప్రిన్సిపాల్ చల్లా హైమావతి మాట్లాడుతూ” ప్రపంచానికి సత్యం అహింస “ మార్గాన్ని గాంధీ అందించారని “ విద్వేషం -హింస “ పెంచడాన్ని వ్యతిరేకించాలన్నారు. విశ్రాంత ప్రిన్సిపాల్ సంకు మనోరమ మాట్లాడుతూ గాంధీ పేరు తొలగించే ప్రయత్నాలను ప్రతిఘటించాలన్నారు. కొవ్వలి ఆంజనేయశర్మ మాట్లాడుతూ గాంధీ – నెహ్రూ – పటేల్ – బోస్ లపై నిరంతరం జరుగుతున్న అసత్య ప్రచారాలను చారిత్రక ఆధారాలతో తిప్పికొట్టాలన్నారు. డా.భూపతిరాజు రమేష్ చంద్రబాబు మాట్లాడుతూ గాంధీజీని భౌతికంగా చంపినవారు ఇప్పుడు ఆయన భావజాలాన్ని చంపడానికి చేస్తున్న రకరకాల ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు.
సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, పుర ప్రముఖులు దాట్ల సత్యనారాయణరాజు, నందిగం సుధాకర్, కౌరు వెంకటేశ్వర్లు,
దిర్శిపో రామకృష్ణ, రామకృష్ణంరాజు, భూపతిరాజు ఝాన్సీ, సీనియర్ సిటిజన్స్ సంఘాల నాయకులు అడ్డాల సత్యనారాయణ, కె. వి. ఆంజనేయులు, ఎ. భాస్కరరావు,ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, పార్వతి, మానవత ఆలపాటి సుబ్బారావు, లయన్ చీకటి శ్రీనివాసరావు, గార ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


