గ్లోబల్ లీడర్గా ఎదిగిన చంద్రబాబునాయుడు – కొనియాడిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
పండుగలా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు – తణుకులో కొనసాగిన సేవా కార్యక్రమాలు
నాలుగు పర్యాయాలు 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 18 ఏళ్లపాటు ప్రతిపక్షనేతగా రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో ఆర్థిక విధ్వంసం చేసినప్పటికీ అలాంటి గాయాల ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తూ మూడక్షరాల బ్రాండ్ ‘సీబీఎన్’ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు, భవిష్యత్తు తరాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తణుకులో పండుగలా వేడుకలు నిర్వహించారు. తణుకు నియోజవర్గంలో వాడవాడలా చంద్రబాబు జన్మదిన వేడుకలను చేపట్టారు. ఈ సందర్భంగా తణుకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారీ కేకు కట్ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఏప్రిల్ 20 పండుగ రోజని రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చంద్రబాబు జన్మదిన వేడుకలు తణుకు నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీను సంస్థాగత నిర్మాణం చేస్తూ కోటి మంది సభ్యులతో దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు 45 సంవత్సరాల రాజకీయం ప్రస్థానంలో కాలేజీ స్థాయిలోనే నాయకత్వ లక్షణాలతో యూనియన్ నాయకుడిగా గెలిచి అనంతరం అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి 28 ఏళ్లకే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ నారావారి పల్లె నుంచి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చేసి ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపారని కొనియాడారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లో గ్లోబల్ లీడర్గా చంద్రబాబునాయుడు ఎదిగారని అన్నారు. రాజకీయాల్లో కేవలం ఎన్నికల్లోనే కాకుండా అయిదు సంవత్సరాలకే ఆలోచనలు పరిమితం చేయకుండా భవిష్యత్తు తరాల కోసం రాబోయే 20 ఏళ్లలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలో ముందు చూపుతో వ్యవహరించే వ్యక్తి అని పేర్కొన్నారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జన్మభూమి, ప్రజలవద్దకే పాలన, విజన్ 2020 ద్వారా రాష్ట్రాభివృద్ధి ఎలా ఉండాలనే ముందు చూపుతో ఊహా చిత్రం గీసి ఆ ఊహను సాధ్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మాదాపూర్లో కేవలం హైటెక్సిటీతో ప్రారంభించి ప్రస్తుతం దేశంలోనే హైదరాబాదు ఆర్థిక రాజధానిగా సైబరాబాదు నగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. 2014లో నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు అమరావతి నిర్మాణానికి అనేక మంది రైతుల ద్వారా 39 వేల ఎకరాలు సేకరించి ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగని విధంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. తిరిగి 2024లో సీఎంగా బాధ్యతలు తీసుకున్న ఆయన విజన్ 2047 ద్వారా రాష్ట్ర భవిష్యత్తును నిర్ధేశించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకుని యువత పార్టీ పటిష్టత కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, యువనాయకులు నారా లోకేష్ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు.
విస్తృతంగా సేవా కార్యక్రమాలు…
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం సేవాకార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. తణుకు పట్టణంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం సంధ్యాజ్యోతి, వాసవి జ్యోతి వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. గుడ్ సమరిటన్ చిల్డ్రన్ హోంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని రూ. 10 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ‘ఉయ్ లవ్ చంద్రబాబు… హ్యాపీ బర్త్ డే చంద్రబాబు’ అంటూ ఎమ్మెల్యే రాధాకృష్ణ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


