సమాజంలో సోదరభావాన్ని పెంపొందిచే రంజాన్
రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టుబడి ఉన్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని తణుకు పాతవూరులోని కొమ్మాయిచెరువు గట్టు వద్ద ఈద్గా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఆయన నమాజ్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ సమాజంలో మంచిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనల్ని మనం తిరిగి కొత్తదనంతో నింపుకోవాలని అల్లా ఆశీస్సులతో మంచి మార్గాన్ని ఏర్పరచుకోవాలని నెలరోజుల పాటు ముస్లిం సోదరులు చేసిన దీక్షల ఫలితంగా సమాజానికి, మన కుటుంబానికి ఎంతో పవిత్రత లభిస్తుందని చెప్పారు. రంజాన్ పండుగతో అందరి ప్రేమ, అనురాగం సమాజంలో అందరికీ సోదరభావాన్ని పెంపొందింపజేస్తుందని అన్నారు. ముస్లిం, మైనార్టీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో మొదటి సారిగా చంద్రబాబునాయుడు ముస్లిం సోదరులు మక్కా హజ్ యాత్ర వెళ్లేందుకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో గతంలో కంటే రూ. వెయ్యి కోట్లు అదనంగా సుమారు రూ. 5,500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పేదరికాన్ని తరిమికొట్టాలనే సంకల్పంతో పీ4 విధానాన్ని ముఖ్యమంతి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి సాధించాలనే పీ4 ముఖ్య ఉద్దేశమన్నారు. ముస్లిం, మైనార్టీల ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబునాయుడు ముందు ఉంటారన్నారు. తణుకులో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


