టిడిపి, జనసేన, బీజేపీ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి నాంది
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు
తణుకు నియోజకవర్గ జనసైనికుల ఆత్మీయ సమావేశం
తణుకు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి టిడిపి, జనసేన, బీజేపీ కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. కూటమి పార్టీల సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. గురువారం తణుకులోని వీకే కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన జనసైనికుల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సమన్వయంతో దేశ ప్రధాని నరేంద్రమోదీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. బరిలో నిలబడిన ప్రతి అభ్యర్థి గెలిపించేలా తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో ప్రజల్లోకి తీసికెళ్లాలని కోరారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు టిడిపి, బీజేపీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అత్తిలి ఏఎంసీ ఛైర్మన్, అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, తణుకు, తణుకు రూరల్, ఇరగవరం మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


