అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ప్రతి ఏటా యూకే ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక చివెనింగ్ స్కాలర్ షిప్కు తణుకు 11వ వార్డుకు చెందిన ముళ్లపూడి నవీన్కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నవీన్కుమార్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారిలో వెయ్యి మందిని ఎంపిక చేయగా భారత్కు 52 మంది కాగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నవీన్కుమార్ ఒక్కరే అన్నారు. భవిష్యత్తులో యువతకు నవీన్కుమార్ స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలుగువారికే కాకుండా తణుకు నియోజకవర్గానికే ఈ ఘనత గర్తకారణమన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్కుమార్ కుటుంబ సభ్యులతోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


