రైతులు తప్పనిసరిగా పంటల భీమా చేయించుకోవాలి

నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం కొవ్వూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సహాయకులు సి.హెచ్. శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి, మినుము మరియు అరటి పంటలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా పంటల భీమా చేయించుకోవాలని పిలుపునిచ్చారు. మనిషికి ఎలా బీమా చేసుకుంటామో, పంటలకు కూడా భీమా చేసుకోవడం వల్ల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు కారణంగా దిగుబడు తగ్గితే బీమా పొందే అవకాశం ఉంటుందన్నారు. అరటి సాగు చేసే రైతులు ఈనెల 30వ తేదీ లోపు ఎకరాకు రూ. 3000 చొప్పున, వరి సాగు చేసే రైతులు ఆగస్టు 15వ తేదీ లోపు ఎకరాకు రూ. 570 చెల్లించవచ్చన్నారు. పంట రుణం తీసుకునే రైతులు నేరుగా సంబంధిత బ్యాంకులకు వెళ్లి అంగీకార పత్రం సమర్పించాలని పంట రుణం తీసుకొని రైతులు, కౌలు రైతులు, సొంత రైతులు సమీప మీసేవా కేంద్రాలు, రైతు సేవా కేంద్రాలను సంప్రదించవచ్చని సూచించారు. అరటికీ వాతావరణ ఆధారితంగాను వరి కి దిగుబడి ఆధారంగాను గ్రామం యూనిట్గా భీమా చెల్లింపు ఉంటుందని వివరించారు. ఈ పంట నమోదు చేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉండదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ మాట్లాడుతూ బోర్ల కింద వరి సాగు చేసే రైతులు ఆయిల్ ఫామ్ సాగు వైపు పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా డీలర్ నుంచి రసీదు తీసుకోవాలని అవసరానికి మించి రసాయనాలు వాడొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుమామిడి సొసైటీ అధ్యక్షులు మట్టపర్తి చంద్రరావు, గ్రామ రైతులు, రైతు సేవా కేంద్రం సిబ్బంది భాను ప్రకాష్, సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link