రాజమహేంద్రవరంలో మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నవరం దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జనసేన నాయకులు
రాజమహేంద్రవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానం వద్ద రత్నగిరి కొండపై పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక పార్కును నిర్మించాలని కోరుతూ అన్నవరం దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, జనసేన నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్కు ప్రతిపాదనల పత్రాన్ని అందజేశారు. బుధవారం రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధికార ప్రతినిధి, అన్నవరం దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు తోలేటి శిరీష, ప్రత్యేక ఆహ్వానితులు గంజి గోవిందరాజు, జనసేన నేతలు రామిశెట్టి సూరిబాబు, కంద సోమరాజులు మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అన్నవరం దేవస్థానం నుంచి పూజించి తెచ్చిన స్వామివారి శేషవస్త్రాన్ని మంత్రికి కప్పి, చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం పార్కు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను మంత్రికి వివరించారు. గతంలో తొలగించబడిన పార్క్ ను ప్రస్తుతం శివ సదన్, ప్రకాష్ సదన్ ల వద్ద ఏర్పాటు చేయాలని కోరగా దీనిపై మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందిస్తూ… ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పార్కు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
అనంతరం హుకుంపేట కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై మంత్రికి అర్జీలు సమర్పించారు. స్పందించిన మంత్రి దుర్గేష్… కొన్ని తక్షణ సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కార దిశగా ఆదేశాలు జారీ చేశారు.
ఇదే క్రమంలో ఏపీఎన్జీవోల ప్రతినిధులు మంత్రి దుర్గేష్ ని కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వారికి భరోసా ఇచ్చారు.



