నిడదవోలును ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దుతాం..మంత్రి కందుల దుర్గేష్ ధీమా
మంత్రి దుర్గేష్ చొరవతో ఆలయాల అభివృద్ధికి నిధులు వెల్లువెత్తడంపై నియోజకవర్గ ప్రజానికం హర్షం
నిడదవోలు, మే 7, 2026:
నిడదవోలు పట్టణంలోని అత్యంత పురాతనమైన, ప్రసిద్ధి చెందిన శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయానికి వైభవం సంతరించుకోనుంది. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో ఈ ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం కూటమి ప్రభుత్వం రూ. 50 లక్షల నిధులను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక నగరిగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి కందుల దుర్గేష్… దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పలుమార్లు చర్చలు జరిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన దేవాదాయశాఖ ఆలయ పునర్నిర్మాణం మరియు అభివృద్ధి పనులకు భారీగా నిధులను కేటాయించింది. గురువారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్న క్రమంలో ఈ నిధుల మంజూరుపై మంత్రి దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. నిడదవోలు అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లకు
మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ “నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే మాలక్ష్యం. గోలింగేశ్వరస్వామి ఆలయ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో ధర్మ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలి” అని కోరారు. మంత్రి దుర్గేష్ కృషితో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆలయ అభివృద్ధి పనులకు మోక్షం లభించడంతో నిడదవోలు భక్తజన సందోహం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.



