కార్మిక సంఘాల కార్యకలాపాలను కొత్త పుంతలు తొక్కింది వారిని రాజకీయ సామాజిక ఉద్యమాల బాట పట్టించిన మార్గదర్శి కలిదిండి భీమరాజు చిరస్మరణీయుడు అని ఆయన 93 వ జయంతి సభలో డి. వి. వి. యస్. వర్మ కొనియాడారు.
2014 లో మోదీ ఎన్నికకు ముందే ” మోదీ ఎన్నికల రణతంత్రం” పేరుతో పుస్తకాన్ని ప్రచురించి కార్మికవర్గం భాగస్వామ్యంతో రాజకీయ ప్రచారాన్ని సాగించారని, హిదూత్వ రాజకీయం విద్వేష రాజకీయాన్ని బట్టబయలు చేసే ” భారతీయులం, గాంధ హత్య వెనుక- అన్ని పుస్తకాలను ప్రచురించి సభలు, సమావేశాలను నిర్వహించారని, మద్యం బానిసల విముక్తి మందుల పంపిణీ శిబిరాన్ని జీవితాంతం వరకు నిర్వహించారని, ఉత్తమ శ్రేణి కార్మిక నాయకులకు తయారుచేయడం ఆయన ప్రత్యేకతగా వర్మ పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది జి. సీతారామరాజు మాట్లాడుతూ దీర్ఘకాలంపాటు భీమరాజుతో పనిచేయడం ఎంతో స్ఫూర్తి నిచ్చిందని, వృత్తి పట్ల నిబద్ధత, క్రమశిక్షణకు ఆయన నిలువెత్తు నిదర్శనం అన్నారు.
ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు మాట్లాడుతూ తనను న్యాయవాదిగా చేసింది భీమరాజు అని, కార్మికోద్యమంలో ఓనమాలు దిద్దిచినదీ అయనేనని, కార్యకర్తల ఎదుగుదల కోసం చూపిన శ్రద్ధ అందరికీ శిరోధార్యం అన్నారు. కేసును పెట్టడం కంటే న్యాయం జరగడం ముఖ్యంగా భావించడం న్యాయవాది వృత్తికి గౌరవం తేవడం ఆయన ప్రత్యేకతగా న్యాయవాది పి. పి. శాస్త్రి అన్నారు. మరో న్యాయవాది పి. రంగారావు మాట్లాడుతూ ఆయనకు రాజకీయ విశ్లేషణలో అనితర సాధ్యమైన అవగాహన వుందని, ఆయనకు సాహిత్యం ,సంగీతం, కళల పట్ల గల మక్కువను సోదాహరణలతో వివరించారు.
అనంతరం భీమరాజు దగ్గర సుదీర్ఘ కాలం న్యాయవాది సహచరునిగా పని చేసిన జి. సీతారామరాజు సహచర కార్మిక నాయకులుగా పని చేసిన దత్తాత్రేయ ప్రసాద్, చుండ్రు వెంకట్రావులను సన్మానించారు. ఈ సభలో డా.రమేష్ చంద్రబాబు, ఆకుల వెంకటేశ్వరరావు, లింకు మనోరమ, బొద్దాని నాగరాజు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


