మొంథా తుఫాన్ బాధితులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్
ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు నిడదవోలు మండలంలోని పెండ్యాలలో 44 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, పంచదార, లీటర్ ఆయిల్ స్వయంగా పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
నియోజకవర్గంలో 23 గ్రామాలకు చెందిన 312 కుటుంబాల్లోని 640 మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించామని పేర్కొన్న మంత్రి దుర్గేష్..వారందరికీ నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామని వెల్లడి
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నేతృత్వంలో మొంథా తుఫాన్ కట్టడికి అధికార యంత్రాంగం అద్భుత పనితీరు కనబర్చిందని ప్రశంస
తుఫాన్ ప్రభావం ధాటికి గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యగా కూటమి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసిన విధానాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్
ముందస్తు ప్రణాళికతో మొంథా తుఫాన్ ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం కట్టడి చేయడంలో, తుఫాన్ తీవ్రతను తగ్గించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్, సహచర మంత్రులు వ్యవహరించిన తీరు స్ఫూర్తిదాయకం అని మంత్రి దుర్గేష్ అన్నారు. శుక్రవారం నిడదవోలు మండలంలోని పెండ్యాల గ్రామంలో మొంథా తుఫాన్ బారిన పడిన 44 మంది బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున మంత్రి కందుల దుర్గేష్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మొంథా తుఫాన్ తీరం దాటిన సమయంలో ఎర్రకాలువ పరిసర ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల్లో జాగ్రత్తగా ఉండాలని విస్తృత ప్రచారం చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.. మొత్తంగా నిడదవోలు నియోజకవర్గంలో 23 గ్రామాల్లోని 312 కుటుంబాలను తద్వారా 640 మంది కుటుంబ సభ్యులను పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు. ఇళ్లకు, వారి పనులకు దూరమై పునరావాస శిబిరాల్లో నాలుగైదు రోజులు ఉన్న బాధిత ప్రజల ఆదాయ మార్గాలకు ఇబ్బంది కలిగిందని గ్రహించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డ, కేజీ పంచదార అందించామని వెల్లడించారు. మత్స్యకారులు, చేనేత కార్మికులకు అదనంగా 50 కిలోల బియ్యం అందించామన్నారు.
తొలి నుండి పెండ్యాల గ్రామంపై ప్రత్యేక దృష్టిసారించామని మంత్రి దుర్గేష్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించి పంచాయతీరాజ్ శాఖ, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామంలో రూ. కోటితో రోడ్ల నిర్మాణాల పనులు చేపట్టామన్నారు. ఎస్సీ వర్గానికి అవసరమైన మంచి నీటి సదుపాయం కల్పించామన్నారు. క్రమ పద్ధతిలో నియోజకవర్గాన్ని, పెండ్యాల గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారించామన్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న లబ్ధిని వివరించారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నేతృత్వంలో మొంథా తుఫాన్ కట్టడికి అధికార యంత్రాంగం అద్భుత పనితీరు కనబర్చిందని మంత్రి దుర్గేష్ అభినందించారు. తుఫాన్ ప్రభావం ధాటికి గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యగా కూటమి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేసిన విధానాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా తాము బాసటగా నిలుస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు చేస్తున్న కృషికి అందరం సహకరిద్దామని మంత్రి దుర్గేష్ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, ఎమ్మార్వో కృష్ణనాయక్, అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


