తణుకులో మోదీ జన్మదిన వేడుకలు
సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ
పేదరికంలో పుట్టిన నరేంద్రమోదీ చాయ్వాలాగా పని చేసి బీజేపీలో చేరి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఆయన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తణుకులో బుధవారం ఏర్పాటు చేసిన పలు సేవాకార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గుజరాత్ రాష్ట్రానికి 11 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఆయన దేశ ప్రధానిగా 13 ఏళ్లుగా దేశం దిశదశమార్చిన డైనమిక్ ప్రధానమంత్రిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు సాధించారన్నారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఆయుష్మాన్భవ ద్వారా పేదలకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2014 అక్టోబర్ 2న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చి ఆ దిశగా పరుగులు పెట్టిస్తున్న ఘనత నరేంద్రమోదీదని అన్నారు. నరేంద్రమోదీ స్ఫూర్తితో తణుకు నియోజవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. తొలుత తణుకులోని కొమ్మాయిచెరువుగట్టు పార్కు పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. అనతరం తణుకు మున్సిపల్ కార్మికుల సమక్షంలో కేకు కట్ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ కార్మికులకు ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


