గోదావరి పుష్కరాలు -2027 అత్యంత వైభవంగా నిర్వహిస్తాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్.
ముమ్మిడివరంలో గోదావరి రేవును పరిశీలించిన మంత్రి దుర్గేష్
గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లు, రేవులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్
రాష్ట్ర,దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి గోదావరి పుష్కరాలకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులు, యాత్రికులకు సరైన వసతులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ఇప్పటి నుండే చర్యలు తీసుకొంటోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న గోదావరి రేవును పరిశీలించారు. స్థానిక పర్యాటక అభివృద్ధికి కావాల్సిన వివరాలపై స్థానిక నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు 2027 జూలై 23 నుండి 3 ఆగష్టు వరకు జరగనున్నాయని, అప్పటివరకు రేవులన్నింటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి పన్నేండేళ్లకు ఒకసారి వచ్చే పవిత్ర గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని, ఈ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు ఉంటాయని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ఇప్పటికే ముందస్తు కార్యాచరణ సిద్ధం చేశామని, అంగరంగ వైభవంగా గోదావరి పుష్కరాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెంట ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు బుచ్చిబాబు, కూటమి నాయకులు నాగరాజు, విజయ్, ప్రసన్న, సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


